బుధవారం, మార్చి 27
‘రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వండి.’—మత్త. 6:33.
యేసు చనిపోయినప్పుడు శిష్యులు ఎంతో బాధపడ్డారు. వాళ్లు మంచి స్నేహితుణ్ణి కోల్పోయారు, ముందుముందు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. (లూకా 24:17-21) కానీ పునరుత్థానమైన యేసు, బైబిలు ప్రవచనాల్ని తాను ఎలా నెరవేర్చాడో వాళ్లకు వివరించాడు. అంతేకాదు వాళ్లకు ఒక ముఖ్యమైన పని అప్పగించాడు. (లూకా 24:26, 27, 45-48) యేసు పరలోకానికి వెళ్లిపోయే సమయానికి వాళ్ల బాధ సంతోషంగా మారిపోయింది. వాళ్ల ప్రభువు బ్రతికే ఉన్నాడని, తమకు అప్పగించిన కొత్త పనిని చేయడంలో సహాయం చేస్తాడని తెలుసుకున్నప్పుడు వాళ్లు ఎంతో సంతోషించారు. ఆ సంతోషంతో వాళ్లు మానకుండా యెహోవా సేవలో కొనసాగారు. (లూకా 24:52, 53; అపొ. 5:42) యేసు శిష్యుల్లానే మనం దేవుని రాజ్యానికి మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలి. నిజమే యెహోవా సేవలో కొనసాగుతూ ఉండాలంటే, మనకు సహనం అవసరం. అయితే మనం చేసే ప్రయత్నాలన్నిటినీ మెండుగా దీవిస్తానని యెహోవా మాటిస్తున్నాడు.—సామె. 10:22. w23.01 30-31 ¶15-16
జ్ఞాపకార్థ ఆచరణ కోసం బైబిలు పఠనం: (పగటిపూట జరిగిన సంఘటనలు: నీసాను 16) మార్కు 16:2-8
గురువారం, మార్చి 28
“నువ్వు . . . తిరిగి మట్టికి చేరుతావు.”—ఆది. 3:19.
ఆదాముహవ్వలు చేసిన తప్పును మనం చేయాలనుకోం. మనం వాళ్లలా తయారవ్వకూడదంటే యెహోవా గురించి నేర్చుకుంటూ, ఆయన లక్షణాల్ని ఇష్టపడుతూ, ఆయన ఆలోచనా విధానాన్ని అర్థంచేసుకుంటూ ఉండాలి. అప్పుడు యెహోవా మీద మనకు ఉన్న ప్రేమ ఖచ్చితంగా పెరుగుతుంది. అబ్రాహాము గురించి ఆలోచించండి. ఆయన యెహోవాను నిజంగా ప్రేమించాడు. యెహోవా నిర్ణయాల్ని అర్థం చేసుకోవడం ఆయనకు కష్టంగా అనిపించినా ఆయన ఎదురుతిరగలేదు. బదులుగా యెహోవాను ఇంకా బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఉదాహరణకు, సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తానని యెహోవా అబ్రాహాముకు చెప్పాడు. “భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు,” చెడ్డవాళ్లతో పాటు నీతిమంతుల్ని నాశనం చేస్తాడేమోనని అబ్రాహాము మొదట్లో భయపడ్డాడు. యెహోవా అలా చేయడాన్ని అబ్రాహాము ఊహించుకోలేక పోయాడు. అందుకే వినయంగా, యెహోవాను కొన్ని ప్రశ్నలు అడిగాడు. యెహోవా ఆయన ప్రశ్నలకు ఓపిగ్గా జవాబిచ్చాడు. దాంతో యెహోవా ప్రతీ మనిషి హృదయాన్ని పరిశీలిస్తాడని, చెడ్డవాళ్లతో పాటు నిర్దోషుల్ని ఎన్నడూ శిక్షించడని అబ్రాహాము అర్థం చేసుకున్నాడు.—ఆది. 18:20-32. w22.08 28 ¶9-10
శుక్రవారం, మార్చి 29
“నమ్మదగినవాడు రహస్యాలు దాచిపెడతాడు.”—సామె. 11:13.
క్రీ.పూ. 455 లో యెరూషలేము గోడల్ని తిరిగి కట్టిన తర్వాత, నగరాన్ని చక్కగా చూసుకునే నమ్మదగిన వాళ్లకోసం అధిపతి అయిన నెహెమ్యా వెతికాడు. నెహెమ్యా ఎంచుకున్న వాళ్లలో ఒకరు కోట అధిపతి అయిన హనన్యా. ఆయన “ఎంతో నమ్మకస్థుడు, ఎంతోమంది కన్నా సత్యదేవునికి ఎక్కువగా భయపడేవాడు” అని బైబిలు హనన్యా గురించి చెప్తుంది. (నెహె. 7:2) యెహోవా మీద ప్రేమ, ఆయన్ని బాధపెట్టే ఏ పనీ చేయకూడదు అనే భయం ఉండడం వల్ల, తనకు ఇచ్చిన ప్రతీ నియామకాన్ని హనన్యా కష్టపడి చేశాడు. మనకు కూడా యెహోవా మీద ప్రేమ, భయం ఉంటే ఆయన సేవలో నమ్మదగిన వాళ్లలా ఉంటాం. అపొస్తలుడైన పౌలుకు నమ్మదగిన సహోదరుడిగా ఉన్న తుకికు ఉదాహరణ గురించి ఆలోచించండి. పౌలు తుకికు మీద ఆధారపడ్డాడు. తుకికు ఒక “నమ్మకమైన పరిచారకుడు” అని కూడా పౌలు చెప్పాడు. (ఎఫె. 6:21, 22) ఎఫెసు, కొలొస్సయి సంఘాల్లో ఉన్న సహోదరులకు ఉత్తరాల్ని అందించే పనిని, అలాగే వాళ్లను ప్రోత్సహించే, ఓదార్చే పనిని అప్పగించడం ద్వారా తనకు తుకికు మీద ఎంతో నమ్మకం ఉందని పౌలు చూపించాడు. తుకికు గురించి ఆలోచిస్తే, నేడు మన ఆధ్యాత్మిక అవసరాల్ని చూసుకుంటున్న నమ్మదగిన, ఆధారపడదగిన సహోదరులు గుర్తుకొస్తారు.—కొలొ. 4:7-9. w22.09 9-10 ¶5-6