సోమవారం, ఆగస్టు 31
“నా కన్నీళ్లను నీ తోలుసంచిలో ఉంచు.”—కీర్త. 56:8.
కన్నీళ్లను మిగిల్చే ఎన్నో పెద్దపెద్ద కష్టాల్ని దావీదు చూశాడు. చాలామంది ఆయన ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నించారు, తన వెన్నంటే ఉండాల్సినవాళ్లే వెన్నుపోటు పొడిచారు. (1 సమూ. 19:10, 11; 2 సమూ. 15:10-14, 30) ఒకసారి ఆయన ఇలా రాశాడు: “నా మూల్గులతో నేను నీరసించిపోయాను; రాత్రంతా నా పరుపు కన్నీళ్లతో తడిచిపోతోంది; నా మంచం కన్నీళ్లలో మునిగిపోతోంది.” తనను వేధించేవాళ్ల వల్ల ఇలా జరిగిందని ఆయన తర్వాత రాశాడు. (కీర్త. 6:6) ఎన్ని పెద్దపెద్ద కష్టాలు వచ్చినా యెహోవా తనను ప్రేమిస్తున్నాడనే విషయంలో దావీదుకు ఏ సందేహం లేదు. ఆయన ఇలా రాశాడు: “యెహోవా నా రోదనను వింటాడు.” (కీర్త. 6:8) మన దినవచనంలోని మాటలు యెహోవా మనల్ని అపురూపంగా చూసుకుంటున్నాడని స్పష్టం చేస్తున్నాయి. యెహోవా మన కన్నీళ్లను ఒక బాటిల్లో పెట్టుకుంటున్నాడని లేదా వాటిగురించి ఒక పుస్తకంలో రాసుకుంటున్నాడని దావీదుకు అనిపించింది. తను అనుభవిస్తున్న నొప్పిని యెహోవా గమనించి, గుర్తుపెట్టుకుంటాడని దావీదు పూర్తిగా నమ్మాడు. అయితే తనకు ఎలాంటి సమస్యలు వచ్చాయనే కాదు, వాటివల్ల తనకు ఎలా అనిపించిందో కూడా తన ప్రేమగల పరలోక తండ్రి గమనిస్తున్నాడని దావీదు గట్టిగా నమ్మాడు. w24.12 22 ¶11-12
మంగళవారం, సెప్టెంబరు 1
“మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో పరీక్షించుకుంటూ ఉండండి.”—2 కొరిం. 13:5.
మనం పరిణతి సాధించడానికే కాదు దాన్ని కాపాడుకోవడానికి కూడా కష్టపడాలి. కాబట్టి మనం పరిణతి సాధించేశాం అని ఎప్పుడూ అనుకోకూడదు. (1 కొరిం. 10:12) మనం పరిణతి సాధిస్తున్నామో లేదో ఎప్పటికప్పుడు “పరీక్షించుకుంటూ” ఉండాలి. అపొస్తలుడైన పౌలు కొలొస్సయులకు రాసిన ఉత్తరంలో పరిణతిని కాపాడుకోవడం ఎంత ప్రాముఖ్యమో చెప్పాడు. అది చెప్పే సమయానికే కొలొస్సయిలోని క్రైస్తవులు ఆధ్యాత్మికంగా పెద్దవాళ్లలా ఉన్నారు. అయినా, ఈ లోక ఆలోచనలు వంటపట్టించుకోకుండా జాగ్రత్తపడాలని పౌలు వాళ్లని హెచ్చరించాడు. (కొలొ. 2:6-10) కొలొస్సయి సంఘంవాళ్ల గురించి బాగా తెలిసిన ఎపఫ్రా కూడా వాళ్లు “స్థిరంగా నిలబడాలని” లేదా వాళ్ల పరిణతి కాపాడుకోవాలని పట్టుదలగా ప్రార్థిస్తూ ఉన్నాడు. (కొలొ. 4:12) దీన్నుండి మనమేం నేర్చుకోవచ్చు? పరిణతిని కాపాడుకుంటూ ఉండాలంటే సొంత కృషితోపాటు దేవుని మద్దతు కూడా అవసరమని పౌలుకు, ఎపఫ్రాకు తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కొలొస్సయిలోని క్రైస్తవులు పరిణతిని కాపాడుకుంటూ ఆధ్యాత్మికంగా పెద్దవాళ్లలా ఉండాలని వాళ్లు కోరుకున్నారు. w24.04 6-7 ¶16-17
బుధవారం, సెప్టెంబరు 2
“మనకు . . . యెహోవా తోడుగా ఉన్నాడు. మీరు వాళ్లకు భయపడకండి.”—సంఖ్యా. 14:9.
యెహోవా మీద సరైన భయం ఉంటే ఆయన్ని చాలా ప్రేమిస్తాం, ఆయన్ని బాధపెట్టే ఏ పనీ చేయం. అంతేకాదు ఏది తప్పో ఏది ఒప్పో, ఏది సత్యమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి మనం చాలా ఆసక్తి చూపిస్తాం. అలా చేయడంవల్ల యెహోవా హృదయాన్ని సంతోషపెడతాం. (సామె. 2:3-6; హెబ్రీ. 5:14) మనకు యెహోవా మీద భయం కన్నా మనుషుల మీద భయం ఎక్కువైనప్పుడు సత్యం నుండి పక్కదారి పడతాం. 12 మంది ప్రధానుల ఉదాహరణ గమనించండి. యెహోవా ఇశ్రాయేలీయులకు ఇస్తానని మాటిచ్చిన దేశాన్ని వేగు చూడడానికి వాళ్లు వెళ్లారు. వాళ్లల్లో పదిమంది వేగుల వాళ్లకు యెహోవా మీద ప్రేమకన్నా కనానీయుల మీద భయమే ఎక్కువైంది. అప్పుడు వాళ్లు తోటి ఇశ్రాయేలీయులతో ఇలా అన్నారు: “మనం ఆ ప్రజలతో యుద్ధం చేయలేం, వాళ్లు మనకన్నా బలవంతులు.” (సంఖ్యా. 13:27-31) నిజమే, మనుషుల వైపు నుండి చూస్తే కనానీయులే చాలా బలవంతులు. కానీ ఇశ్రాయేలీయులు తమ శత్రువుల్ని ఓడించలేరని చెప్పడం ద్వారా వాళ్లు యెహోవాను పూర్తిగా మర్చిపోయారు. w24.07 9 ¶5-6