ప్రకటన
6 గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రల్లో ఒకదాన్ని విప్పడం నేను చూశాను. అప్పుడు నాలుగు జీవుల్లో ఒక జీవి ఉరుము లాంటి స్వరంతో, “రా!” అని చెప్పడం విన్నాను. 2 నేను చూసినప్పుడు ఇదిగో, ఒక తెల్లని గుర్రం కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి దగ్గర ఒక విల్లు ఉంది. ఆయనకు ఒక కిరీటం ఇవ్వబడింది. ఆయన జయిస్తూ తన విజయాన్ని పూర్తి చేయడానికి బయల్దేరాడు.
3 ఆయన రెండో ముద్ర విప్పినప్పుడు రెండో జీవి, “రా!” అని చెప్పడం విన్నాను. 4 అప్పుడు ఎర్రగా ఉన్న ఇంకో గుర్రం వచ్చింది. దానిమీద కూర్చున్న వ్యక్తికి భూమ్మీద శాంతి లేకుండా చేసేందుకు అనుమతి ఇవ్వబడింది. ప్రజలు ఒకరినొకరు చంపుకోవాలనే ఉద్దేశంతో అలా అనుమతి ఇవ్వబడింది. అంతేకాదు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడింది.
5 ఆయన మూడో ముద్ర విప్పినప్పుడు మూడో జీవి, “రా!” అని చెప్పడం విన్నాను. నేను చూసినప్పుడు ఇదిగో, ఒక నల్లని గుర్రం కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి చేతిలో ఒక త్రాసు ఉంది. 6 ఆ నాలుగు జీవుల మధ్యలో ఒక స్వరం ఇలా అనడం విన్నాను: “దేనారానికి* ఒక కిలో గోధుమలు, దేనారానికి మూడు కిలోల బార్లీ; ఒలీవ నూనెను, ద్రాక్షారసాన్ని పాడుచేయొద్దు.”
7 ఆయన నాలుగో ముద్ర విప్పినప్పుడు నాలుగో జీవి, “రా!” అని చెప్పడం విన్నాను. 8 నేను చూసినప్పుడు ఇదిగో, పాలిపోయిన ఒక గుర్రం కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తికి “మరణం” అనే పేరు ఉంది. సమాధి* అతని వెనకాలే వెళ్తూ ఉంది. ఖడ్గంతో, ఆహారకొరతతో, ప్రాణాంతకమైన జబ్బుతో, క్రూరమృగాలతో ప్రజల్ని చంపేలా భూమి నాల్గవ భాగం మీద వాళ్లకు అధికారం ఇవ్వబడింది.
9 ఆయన ఐదో ముద్ర విప్పినప్పుడు, దేవుని వాక్యాన్ని పాటించడం వల్ల, తాము ఇచ్చిన సాక్ష్యం వల్ల వధించబడినవాళ్ల రక్తాన్ని* బలిపీఠం కింద చూశాను. 10 ఆ రక్తం పెద్ద స్వరంతో ఇలా అరిచింది: “సర్వోన్నత ప్రభువా, పవిత్రుడా, సత్యవంతుడా, భూమ్మీద జీవిస్తున్నవాళ్లకు ఎప్పుడు తీర్పుతీరుస్తావు? మా రక్తం చిందించినందుకు వాళ్ల మీద ఎప్పుడు పగతీర్చుకుంటావు?” 11 వధించబడిన వాళ్లలో ప్రతీ ఒక్కరికి ఒక తెల్లని వస్త్రం ఇవ్వబడింది. ఇంకొంతకాలం పాటు వేచివుండమని, అంటే వాళ్లలాగే చంపబడబోతున్న తోటి దాసుల, సోదరుల సంఖ్య పూర్తయ్యేవరకు వేచివుండమని వాళ్లకు చెప్పబడింది.
12 ఆయన ఆరో ముద్ర విప్పడం నేను చూశాను, అప్పుడు ఒక పెద్ద భూకంపం వచ్చింది. సూర్యుడు వెంట్రుకలతో* చేసిన నల్లని గోనెపట్టలా* అయ్యాడు; చంద్రుడు మొత్తం రక్తంలా ఎర్రగా అయ్యాడు; 13 ఆకాశంలోని నక్షత్రాలు, పెద్ద గాలికి ఊగే అంజూర చెట్టు నుండి కాయలు రాలినట్లు భూమ్మీద రాలాయి. 14 ఆకాశం గ్రంథపు చుట్టలా చుట్టుకొని కనుమరుగైపోయింది. ప్రతీ పర్వతం, ప్రతీ ద్వీపం వాటివాటి స్థానాల నుండి తొలగిపోయాయి. 15 తర్వాత భూరాజులు, ఉన్నతాధికారులు, సైనికాధికారులు, ధనవంతులు, బలవంతులు, ప్రతీ దాసుడు, ప్రతీ స్వతంత్రుడు గుహల్లో, కొండల్లోని బండల మధ్య దాక్కున్నారు. 16 పర్వతాలతో, బండలతో వాళ్లిలా అంటూ ఉన్నారు: “మా మీద పడండి. సింహాసనం మీద కూర్చున్న దేవుని నుండి, గొర్రెపిల్ల ఆగ్రహం నుండి మమ్మల్ని దాచేయండి. 17 ఎందుకంటే వాళ్లు ఆగ్రహం చూపించే మహారోజు వచ్చేసింది, దాన్ని ఎవరు తట్టుకోగలరు?”