మత్తయి
4 ఆ తర్వాత, దేవుని పవిత్రశక్తి యేసును అరణ్యంలోకి తీసుకెళ్లింది. అక్కడ అపవాది ఆయన్ని ప్రలోభపెట్టాలని చూశాడు. 2 యేసు 40 పగళ్లు, 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకు బాగా ఆకలి వేసింది. 3 అప్పుడు అపవాది ఆయన దగ్గరికి వచ్చి, “నువ్వు దేవుని కుమారుడివైతే, ఈ రాళ్లను రొట్టెలుగా మారమని ఆజ్ఞాపించు” అని అన్నాడు. 4 కానీ యేసు ఇలా అన్నాడు: “‘మనిషి రొట్టె వల్ల మాత్రమే జీవించడు కానీ యెహోవా* నోటినుండి వచ్చే ప్రతీ మాట వల్ల జీవిస్తాడు’ అని రాయబడివుంది.”
5 తర్వాత అపవాది ఆయన్ని పవిత్ర నగరంలోకి తీసుకెళ్లి, దేవాలయ గోడ* మీద నిలబెట్టి, 6 ఆయనతో ఇలా అన్నాడు: “నువ్వు దేవుని కుమారుడివైతే కిందకి దూకు, ఎందుకంటే, ‘ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు’ అని, ‘నీ పాదం రాయికి తగలకుండా వాళ్లు తమ చేతులమీద నిన్ను మోస్తారు’ అని రాయబడివుంది.” 7 అప్పుడు యేసు అతనితో, “‘నువ్వు నీ దేవుడైన యెహోవాను* పరీక్షించకూడదు’ అని కూడా రాయబడివుంది” అన్నాడు.
8 ఆ తర్వాత అపవాది ఆయన్ని చాలా ఎత్తైన ఒక కొండ మీదికి తీసుకెళ్లి, లోకంలోని రాజ్యాలన్నిటినీ వాటి మహిమనూ ఆయనకు చూపించి, 9 ఆయనతో ఇలా అన్నాడు: “నువ్వు సాష్టాంగపడి ఒక్కసారి నన్ను ఆరాధిస్తే వీటన్నిటినీ నీకు ఇస్తాను.” 10 అప్పుడు యేసు సాతానుతో ఇలా అన్నాడు: “సాతానా! వెళ్లిపో. ‘నీ దేవుడైన యెహోవాను* నువ్వు ఆరాధించాలి, ఆయనకు మాత్రమే పవిత్రసేవ చేయాలి’ అని రాయబడివుంది.” 11 దాంతో అపవాది ఆయన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు, అప్పుడు ఇదిగో! దేవదూతలు వచ్చి ఆయనకు సేవ చేయడం మొదలుపెట్టారు.
12 ఆ తర్వాత, యోహానును బంధించారని విన్నప్పుడు యేసు గలిలయకు వెళ్లిపోయాడు. 13 అంతేకాక, ఆయన నజరేతు నుండి వచ్చేసి, కపెర్నహూములో నివాసం ఉన్నాడు. ఆ నగరం జెబూలూను, నఫ్తాలి ప్రాంతాల్లోని సముద్ర తీరాన ఉంది. 14 దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన ఈ మాటలు నెరవేరడానికి అలా జరిగింది: 15 “జెబూలూను దేశమా, నఫ్తాలి దేశమా, సముద్రానికి వెళ్లే దారిలో, యొర్దానుకు అవతలి వైపున అన్యులు నివసించే గలిలయ ప్రాంతమా! 16 చీకట్లో కూర్చొనివున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు, మరణం నీడలో కూర్చున్నవాళ్లపై వెలుగు ప్రకాశించింది.” 17 యేసు అప్పటినుండి, “పరలోక రాజ్యం దగ్గరపడింది కాబట్టి పశ్చాత్తాపపడండి” అని చెప్తూ ప్రకటించడం మొదలుపెట్టాడు.
18 ఆయన గలిలయ సముద్ర తీరాన నడుస్తున్నప్పుడు, సముద్రంలో వల వేస్తున్న ఇద్దరు అన్నదమ్ముల్ని చూశాడు. వాళ్లలో ఒకతను సీమోను అని పిలవబడిన పేతురు, ఇంకొకతను పేతురు సోదరుడైన అంద్రెయ. వాళ్లు జాలరులు. 19 ఆయన వాళ్లతో, “నా వెనుక రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను” అన్నాడు. 20 వాళ్లు వెంటనే తమ వలలు వదిలేసి ఆయన్ని అనుసరించారు. 21 యేసు అక్కడి నుండి వెళ్తూ, ఇంకో ఇద్దరు అన్నదమ్ముల్ని అంటే యాకోబును, అతని సోదరుడైన యోహానును చూశాడు. వాళ్లు తమ తండ్రి జెబెదయితోపాటు పడవలో ఉండి తమ వలల్ని బాగుచేసుకుంటున్నారు. యేసు వాళ్లను కూడా పిలిచాడు. 22 వాళ్లు వెంటనే పడవను, తమ తండ్రిని విడిచిపెట్టి యేసును అనుసరించారు.
23 అప్పుడు ఆయన ప్రజల సభామందిరాల్లో బోధిస్తూ, రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ, ప్రజలకున్న ప్రతీ జబ్బును, అనారోగ్యాన్ని నయం చేస్తూ గలిలయ అంతటా ప్రయాణించాడు. 24 ఆయన గురించిన వార్త సిరియా అంతటా వ్యాపించింది. ప్రజలు రకరకాల జబ్బులతో, వేదనలతో బాధపడుతున్న వాళ్లను, చెడ్డ దూతలు పట్టినవాళ్లను, మూర్ఛ రోగుల్ని, పక్షవాతం వచ్చిన వాళ్లందర్నీ ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన వాళ్లను బాగుచేశాడు. 25 అందువల్ల గలిలయ నుండి, దెకపొలి* నుండి, అలాగే యెరూషలేము నుండి, యూదయ నుండి, యొర్దాను అవతలవైపు నుండి చాలామంది ప్రజలు ఆయన వెంట వెళ్లారు.